టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన తారక్.. ఇటీవల 'దేవర' సినిమాతో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సముద్రపు యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో తారక్ నటన, మాస్ యాక్షన్, మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దేవర సక్సెస్ ఇచ్చిన భారీ జోష్ లో ఉన్న ఎన్టీఆర్.. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. సెన్సేషనల్ డైరెక్టర్, కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ తన కొత్త సినిమా చేస్తున్నారు. ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కు 'డ్రాగన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ, 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
నటి మమతా మోహన్దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'యమదొంగ' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి, తనదైన నటనతో పాటు అద్భుతమైన గాత్రంతో (రాఖీ రాఖీ సాంగ్) తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో క్యాన్సర్ బారిన పడిన మమత.. ఎంతో ధైర్యంగా పోరాడి ఆ మహమ్మారిని జయించారు.
అయితే చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, 'రుద్రంగి', విజయ్ సేతుపతి 'మహారాజా' వంటి చిత్రాలతో ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా మోహన్దాస్.. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్తో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ను కేవలం ఒక సహనటుడిగా మాత్రమే కాకుండా, ఒక అద్భుతమైన వ్యక్తిగా తాను భావిస్తానని ఆమె తెలిపారు. తారక్ ఎనర్జీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తన ఫేవరెట్ పర్సన్ అని పేర్కొన్నారు.
తమ ఇద్దరి మధ్య ఇంత బలమైన బంధం ఏర్పడటానికి ముఖ్య కారణం 'సంగీతం' పట్ల ఇద్దరికీ ఉన్న విపరీతమైన ప్రేమేనని మమతా వివరించారు. "మేము ఎప్పుడు కలిసినా ‘యో! వాట్స్ అప్’ అంటూ పలకరించుకుంటాం. అది ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా మా మధ్య స్నేహం, ఆ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.
