మాజీ సైనికులు మరియు అగ్నివీరులకు అండగా నిలిచేందుకు భారత రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణలో సేవలందించి రిటైర్ అయిన జవాన్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారత సైన్యంతో కొత్తగా “ఫ్రేమ్వర్క్ ఆఫ్ కోఆపరేషన్” ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సహకారంతో సైన్యంలో సేవలందించిన వారికి సివిల్ రంగంలో స్థిరమైన ఉపాధి మార్గాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఈ ఒప్పందం ప్రకారం, తక్షణమే 5,000 మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్ట్ విధానంలో ‘పాయింట్స్మెన్’గా నియమించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రైల్వే కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించే బాధ్యత ఈ పదవికి ముఖ్యమైనది కావడంతో, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన మాజీ సైనికులు ఈ పనికి అనుకూలమని అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే, మాజీ సైనికులకు లెవెల్-2, ఆపై స్థాయి పోస్టులలో 10 శాతం, లెవెల్-1 పోస్టులలో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇదే తరహాలో, అగ్నివీరుల కోసం లెవెల్-2, ఆపై స్థాయి పోస్టులలో 5 శాతం, లెవెల్-1 పోస్టులలో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. 2024, 2025 సంవత్సరాల్లో రైల్వే విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో మాజీ సైనికుల కోసం మొత్తం 14,788 పోస్టులను రిజర్వ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
అదనంగా, రైల్వే శాఖ భవిష్యత్తులో మరిన్ని విభాగాల్లో కూడా మాజీ సైనికులకు అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అగ్నివీర్ పథకం ద్వారా సేవలందించిన యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ చర్యతో రిటైర్ అయిన సైనికులకు ఉపాధి భద్రత లభించడమే కాకుండా, రైల్వే వ్యవస్థకు అనుభవం గల సిబ్బంది అందుబాటులోకి రానున్నారు.
