టీ20 ప్రపంచ కప్ ఇప్పుడు అసలు ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. గ్రూప్ దశ ముగియడంతో సూపర్ 8 జట్లు ఖరారయ్యాయి. అధికారిక షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇకపై ప్రతి మ్యాచ్ సెమీ ఫైనల్ స్థాయిలోనే ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే చిన్న తప్పిదం కూడా జట్లకు భారీ మూల్యం చెల్లింపజేయొచ్చు.
గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో సూపర్ 8లోకి అడుగుపెట్టింది. అయితే సూపర్ 8లో మూడు బలమైన జట్లతో తలపడాల్సి ఉండటంతో అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది.
అయితే అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే—నాకౌట్ దశలో మరోసారి భారత్-పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల భావోద్వేగాల పోరు.
final panga matches
ప్రపంచ కప్లో ఇక సూపర్ 8 మ్యాచ్ల ఫలితాల పైనే అందరి ఆసక్తి నెలకొంది. టీమిండియా సూపర్ 8లో ఆడే మూడు జట్లు ఫిక్స్ అయ్యాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్తో సూర్య సేన తలపడనుంది. సూపర్ 8 దశలో పాకిస్థాన్కు గట్టి పోటీ ఎదురవుతుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లతో తేల్చుకోవాల్సి ఉంటుంది.
ఇంగ్లాండ్ దూకుడైన బ్యాటింగ్ లైనప్, న్యూజిలాండ్ క్రమశిక్షణ గల బౌలింగ్ దాడి, శ్రీలంక యువ ఆటగాళ్ల ఉత్సాహం—ఈ మూడు జట్లను అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక భారత్ విషయానికొస్తే, ఇప్పటికే మంచి ఫామ్లో ఉన్న జట్టు సూపర్ 8లోనూ అదే స్థాయిలో ఆడాలి. చిన్న తప్పిదం కూడా సెమీ ఫైనల్ ఆశలను దెబ్బతీయవచ్చు. అందుకే ప్రతి మ్యాచ్ను నాకౌట్ మాదిరిగానే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ప్రతి మ్యాచ్ కూడా కీలకంగా మారడంతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడం తప్పనిసరి. అలా చేస్తేనే సెమీ ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో పాక్ వరుస విజయాలు సాధిస్తే సెమీ ఫైనల్లో భారత్తో మరోసారి తలపడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
