ప్రశాంతంగా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ భూకంపం కారణంగా ఇళ్లు, కిటికీలు స్వల్పంగా కంపించాయి. ఏమి జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపు తీవ్ర ఆందోళన నెలకొనగా, తర్వాత పరిస్థితి సాధారణమైంది.
పల్నాడు జిల్లా ప్రజలకు అర్థరాత్రి భూమి ఒక్కసారిగా కంపించి గట్టి షాక్ ఇచ్చింది. కొన్ని సెకన్ల పాటు ఇళ్లు, ఫ్యాన్లు, కిటికీలు కంపించడంతో ఏమి జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు. మొదట్లో గాలి తుఫానా? లేక భారీ వాహనం వెళ్లిందా? అని అనుకున్న వారు, వెంటనే భూకంపమని గ్రహించి భయాందోళనకు గురయ్యారు. చాలామంది ఇళ్ల నుంచి బయటకు రోడ్లపైకి పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూకంపం కలకలం సృష్టించింది. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రిపోర్ట్ ప్రకారం రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. పల్నాడు జిల్లాలోని వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయి. దీని ప్రభావం వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
అయితే నిపుణులు చేసిన కొన్ని హెచ్చరికలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
భూకంపాలు అంటే ఎక్కువగా జపాన్ వంటి దేశాలు లేదా హిమాలయ ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుసగా భూ ప్రకంపనలు నమోదవుతున్నాయి. భూమి అంతర్భాగంలో ప్లేట్ల కదలికలు లేదా స్థానిక భౌగోళిక మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రాంతాల్లోనూ ఈ తరహా ప్రకంపనలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
