మధ్యప్రదేశ్లో పదో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోని వాష్రూమ్లోనే పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటనతో అక్కడి సిబ్బంది, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ధార్ జిల్లా పరిధిలోని పారిశ్రామిక ప్రాంతం పిథాంపూర్లో మంగళవారం చోటుచేసుకుంది.
పిథాంపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పదో తరగతి గణితం పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మధ్యలో తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఇన్విజిలేటర్ అనుమతితో ఆమె వాష్రూంకు వెళ్లింది. అయితే చాలాసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం కలిగింది.
అప్పటికే వాష్రూం లోపల నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు తెరిచారు. లోపల విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిన పరిస్థితిలో ఉండటం చూసి అందరూ షాక్కు గురయ్యారు.
వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. తల్లి, బిడ్డను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, అయితే కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా విద్యార్థిని ప్రశ్నించగా, గత రెండేళ్లుగా ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు తెలిపింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడిపై పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
