Lunar Eclipse Live Update: మార్చి 3న రాత్రి చంద్రుడు ఇలా మారనున్నాడు!
చంద్రుడు తనంతట తాను వెలుగు ఇవ్వడు. అతనికి స్వంత కాంతి లేదు. పగలు సూర్యుడి కిరణాలు చంద్రుడిపై పడతాయి. ఆ కిరణాలు అక్కడి నుంచి తిరిగి భూమికి వస్తాయి. అప్పుడు మనకు చంద్రుడు వెలిగినట్టుగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి, రాత్రివేళల్లో మనకు అందంగా కనిపించే చంద్రుడి వెలుగు అసలు సూర్యుడి కాంతి ప్రతిబింబమే అనే విషయం మరోసారి స్పష్టమవుతోంది.
చంద్రుడి మీద రాళ్లు, ధూళి ఉంటాయి. అవి సూర్యకాంతిని కొంత మాత్రమే తిరిగి పంపిస్తాయి. అందుకే కొన్ని రోజుల్లో చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు (పౌర్ణమి), మరికొన్ని రోజుల్లో కనిపించడు (అమావాస్య). ఇది భూమి, చంద్రుడు, సూర్యుడు ఎలా ఉన్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
![]() |
| Chandra Grahan 2026 Check Lunar Eclipse Date Time and Visibility in India |
అయితే సూర్యుడి చుట్టూ భూమి కక్ష్యలో ఉన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు మధ్యలో భూమి వస్తుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ పడిన భాగం చీకటిగా మారుతుంది. ఆ సమయంలో మనం భూమిపై నుంచి చంద్రుడిని చూసినప్పుడు కొంత నల్లగా కనిపిస్తుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు.
ఈ ఏడాది మార్చి 3వ తేదీ మంగళవారం రోజున కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం 2026 సంభవించనున్నట్లు జ్యోతిష్య పండితులు వెల్లడించారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనబడుతుందని పేర్కొంటున్నారు.
మనదేశంలో సాయంత్రం 6.20 గంటలకు చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపించనుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో మాత్రం పాక్షికంగా మాత్రమే దర్శనమిస్తుంది. మొత్తం గ్రహణం కొనసాగే సమయం సుమారు 3.27 గంటలు. గ్రహణ మోక్ష కాలం సాయంత్రం 6.48 గంటలకు ఉంటుంది.
ఈ చంద్రగ్రహణ సమయంలో కొన్ని ప్రాంతాల్లో గ్రహణ నియమాలు, శాంతులు, ఆలయాల మూసివేత వంటి ఆచారాలు పాటిస్తారు. అలాగే ఈ గ్రహణం సింహరాశిలో సంభవించడం వల్ల సింహరాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం శుభమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. సింహరాశితో పాటు కుంభ, కర్కాటక, మకర రాశుల వారిపై కూడా ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రాశుల వారు మరుసటి రోజు గ్రహశాంతి, జపాలు, పూజలు నిర్వహించడం ద్వారా దోషాల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.
