గ్యాస్ సిలిండర్ వాడుతున్న ప్రతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత కీలక సమాచారం ఇది. ఎందుకంటే జనవరి 31తో ఒక ముఖ్యమైన డెడ్లైన్ ముగియబోతోంది. ఆ తేదీ తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్నా సరే… సిలిండర్ వస్తుందా? రాదా? అనే సందేహాలు వినియోగదారుల్లో ఎక్కువయ్యాయి.
ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బయోమెట్రిక్ గడువు అంశం పెద్ద కలకలం రేపుతోంది. జనవరి 31, 2026లోపు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్లు పూర్తిగా రద్దు అవుతాయంటూ వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా సందేశాలు వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రచారంలో “డెడ్లైన్ మిస్ అయితే ఇక సిలిండర్ రాదు”, “గ్యాస్ కనెక్షన్ శాశ్వతంగా కట్ అవుతుంది” వంటి భయపెట్టే మాటలు ఉండటంతో సామాన్య వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వార్త మరింత వేగంగా వ్యాపించడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే… ఈ అంశంపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ, ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం) గానీ ఎలాంటి అధికారిక నోటీసులు లేదా స్పష్టమైన ప్రకటనలు విడుదల చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న సందేశాలను నమ్మిన వినియోగదారులు పెద్ద సంఖ్యలో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి క్యూ కడుతున్నారు.
నిజానికి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న జనవరి 2026 గడువు అనేది గ్యాస్ కనెక్షన్లు రద్దు చేసే డెడ్లైన్ కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వం అంతర్గతంగా నిర్వహించే డేటా అప్డేట్, రికార్డుల శుద్ధి ప్రక్రియకు సంబంధించిన గడువుగా మాత్రమే ఉంది. ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే విధానంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలు, డూప్లికేట్ ఎంట్రీలను సరిదిద్దేందుకే చమురు సంస్థలు ఈ గడువును నిర్ణయించుకున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది గ్యాస్ కనెక్షన్లు ఉండటంతో, కొన్నిచోట్ల నకిలీ కనెక్షన్లు, ఒకే వ్యక్తి పేరిట బహుళ కనెక్షన్లు, ఆధార్తో అనుసంధానం లేని ఖాతాలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటివల్ల సబ్సిడీ తప్పుదారి పడే ప్రమాదం ఉండటంతో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు తమ డేటాబేస్ను శుద్ధి చేసే పనిలో ఉన్నాయి.

