సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిచిన గూగుల్, తన సేవలను మరింత విస్తరించేందుకు కొత్త అడుగులు వేస్తోంది. వినియోగదారులకు సులభతరమైన అనుభవం కల్పించాలన్న లక్ష్యంతో గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మరింత స్మార్ట్గా మారబోతోంది. తాజాగా, గూగుల్ మ్యాప్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)తో కలిసి కొత్త సదుపాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
ఇకపై ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులు తమ బస్సు టికెట్లను బుక్ చేసుకోవడానికి వేరే వెబ్సైట్లకు లేదా యాప్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్ ద్వారానే నేరుగా APSRTC బస్సు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లభించనుంది. యూజర్లు గూగుల్ మ్యాప్స్లో తమ ప్రయాణ గమ్యాన్ని ఎంచుకున్నప్పుడు, అందుబాటులో ఉన్న బస్సుల వివరాలు, టైమింగ్స్, ఛార్జీలు, సీటు లభ్యత వంటి సమాచారమంతా ప్రత్యక్షంగా చూపబడుతుంది.
ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు బస్సు ఎక్కడ ఉందో, ఎప్పుడు బయలుదేరుతుందో, గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుందో వంటి వివరాలు రియల్ టైమ్లో తెలుసుకోవచ్చు. అంతేకాదు, గూగుల్ పే లేదా ఇతర పేమెంట్ ఆప్షన్ల ద్వారా వెంటనే చెల్లింపులు చేసి టికెట్ను నిర్ధారించుకోవచ్చు
అధికారుల సమాచారం ప్రకారం, ఈ సౌకర్యాన్ని వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాల్లో ప్రారంభించనున్నారు. మొదటగా హైదరాబాద్–విజయవాడ, విశాఖపట్నం–తిరుపతి, కర్నూలు–అనంతపురం వంటి బిజీ రూట్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తరువాత దశలో గ్రామీణ మార్గాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు.
ఈ కొత్త ఫీచర్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణ వ్యవస్థ మరింత ఆధునికంగా మారనుంది. టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజా రవాణా మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మారడమే కాకుండా, బుకింగ్ ప్రక్రియలో పారదర్శకత కూడా పెరుగుతుంది


