తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ప్రస్తుత ఉత్కంఠభరిత పరిస్థితులపై మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, లోకనాయకుడు కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం మరియు గవర్నర్ అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కమల్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీవీకే పార్టీ తమిళనాడులో చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఉందని గవర్నర్కు గుర్తు చేశారు.
అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను ప్రస్తావిస్తూ ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కమల్ హాసన్ గుర్తుచేశారు. ‘మెజారిటీ అనేది రాజ్భవన్లో కాదు, అసెంబ్లీ వేదికగానే నిరూపితం కావాలి’ అని తెలిపారు.
ఇక 108 స్థానాలు గెలుచుకున్న విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరకపోవడం ఓటర్ల తీర్పును ధిక్కరించడమేనని, ఇప్పటికీ 233 మంది ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది పార్టీ పరంగా చేస్తున్న విమర్శ కాదు, ఒక భారతీయ పౌరుడిగా తన రాజ్యాంగ హక్కులను అందరికీ తెలియజేయడమేనని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
