1961 నుంచి అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టానికి గుడ్బై చెప్పుతూ, కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆదాయపు పన్ను చట్టం–2025ను ప్రవేశపెట్టింది. పాత చట్టంలోని క్లిష్టమైన నిబంధనలు, అనేక సవరణల వల్ల ఏర్పడ్డ అయోమయం తొలగించడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు.
2026 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చట్టానికి సంబంధించిన కీలక మార్పులను ప్రకటిస్తూ, పన్ను వ్యవస్థను మరింత సరళం, పారదర్శకం, డిజిటల్-ఫ్రెండ్లీగా మార్చనున్నట్లు వెల్లడించారు. కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా, ట్యాక్స్ ఫైలింగ్ను సులభతరం చేసేలా దీనిని రూపొందించారు.
సంక్లిష్టతకు స్వస్తి – సరళమైన భాష, స్పష్టమైన నిర్మాణం
1961 ఆదాయపు పన్ను చట్టంలో కనిపించే క్లిష్టమైన న్యాయ పరిభాష, పొడవైన వివరణలు సామాన్య పన్ను దాతలకు పెద్ద సవాలుగా మారాయి. ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025ను అత్యంత సులభంగా అర్థమయ్యే భాషలో రూపొందించారు.
న్యాయ నిపుణులకే కాకుండా, సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు కూడా చట్టాన్ని సులభంగా చదివి అర్థం చేసుకునేలా కీలక మార్పులు చేశారు.
‘ట్యాక్స్ ఇయర్’ విధానం
ఇప్పటివరకు ఉన్న ‘ఫైనాన్షియల్ ఇయర్’ (ఆదాయం వచ్చే ఏడాది) మరియు ‘అసెస్మెంట్ ఇయర్’ (పన్ను లెక్కించే ఏడాది) అనే రెండు వేర్వేరు సంవత్సరాల గందరగోళాన్ని తొలగిస్తూ, రెండింటినీ కలిపి ఒకే ‘ట్యాక్స్ ఇయర్’ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దీనివల్ల ఏ ఏడాది ఆదాయానికి అదే ఏడాది పన్ను లెక్కలు సరిచూసుకోవడం మరింత సులభమవుతుంది.
సరళతరమైన ఐటీఆర్ (ITR) ఫారాలు – గంటల కష్టానికి ముగింపు
ఇప్పటి వరకు ఐటీఆర్ ఫారాలు నింపాలంటే పన్ను చెల్లింపుదారులు గంటల తరబడి కూర్చొని, క్లిష్టమైన కాలమ్స్, క్యాల్క్యులేషన్లతో కుస్తీ పట్టాల్సి వచ్చేది.
ఈ సమస్యకు ముగింపు పలికేలా, ఆదాయపు పన్ను చట్టం–2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త, సరళమైన ఐటీఆర్ ఫారాలను అందుబాటులోకి తీసుకురానుంది.
