చికెన్ ధరలు భారీగా తగ్గాయి – మాంసం ప్రియులకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లోని మాంసం ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. ఏకంగా కిలోపై సుమారు రూ.100 వరకు తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పండుగ సీజన్ ముగియడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడం, డిమాండ్ కొంత తగ్గడం వంటి కారణాలతోనే ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కిలో చికెన్ ధర రూ.300కు పైగా ఉండగా, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.220 మధ్యలో లభిస్తోంది.
మొన్నటివరకు పండుగలు, జాతరలు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. గత నెలలో సంక్రాంతి, మేడారం జాతర కారణంగా వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది.
డిమాండ్ అధికంగా ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో అప్పట్లో ధరల్లో పెరుగుదల నమోదైంది. అయితే ప్రస్తుతం పండుగలు లేకపోవడంతో డిమాండ్ తగ్గింది. ఈ కారణంగా గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తుండటంతో సామాన్యులపై భారం తగ్గుతోంది. నాన్ వెజ్ తినేవారికి ఖర్చు తగ్గడంతో ఊరట కలుగుతోంది.
తగ్గిన కోడిగుడ్ల ధరలు
ఇటీవల వరకూ ఒక్కో కోడిగుడ్డు ధర రూ.9 వరకు పలికింది. దాదాపు రెండు నెలల పాటు అదే ధర కొనసాగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారింది.
గుడ్ల ధరలు క్రమంగా తగ్గుతూ వస్తుండగా, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఒక్కో గుడ్డు రూ.6కే లభిస్తోంది. గుడ్లు ప్రతి ఇంట్లో నిత్యావసరంగా మారిన ఆహార పదార్థం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రోజువారీ ఆహారంలో గుడ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
అలాంటి గుడ్ల ధరలు తగ్గడం సామాన్యులకు నిజంగా ఊరటనిచ్చే పరిణామంగా చెప్పవచ్చు. గతంలో కొన్నిచోట్ల ఒక్కో గుడ్డు రూ.10 వరకు కూడా అమ్ముడవగా, నాటుకోడి గుడ్లు రూ.18 నుంచి రూ.20 వరకు పలికాయి.
పెరిగిన దాణా ధరలు, రవాణా ఖర్చులు, డిమాండ్ అధికంగా ఉండటమే అప్పట్లో ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఇప్పుడు చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పడిపోవడంతో ఇంటి ఖర్చులు కొంత మేర తగ్గనున్నాయి.
మొత్తంగా చూస్తే, ఈ ధరల తగ్గుదల సామాన్య కుటుంబాల బడ్జెట్పై మంచి ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
