న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే చేరుకుంది. దూకుడైన బ్యాటింగ్తో భారత ఆటగాళ్లు మ్యాచ్ను త్వరగా ముగించారు.
ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అతడు 20 బంతుల్లో 68 పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభం అందించాడు. కేవలం 20 బంతుల్లో 68 పరుగులు, ఇందులో 5 భారీ సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. అంటే 58 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. అంతేకాదు, కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దెబ్బకు 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఫినిష్ చేశారు.
మరోవైపు, సిరీస్ ప్రారంభానికి ముందు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. బ్యాటింగ్లో దూకుడుతో పాటు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయానికి దగ్గర చేశాడు. సూర్య 26 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 3 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఓడిపోయిన కసితో ఉన్న భారత్, టీ20 సిరీస్లో అదే జట్టును చిత్తు చేసింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో జరిగిన మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించి, కివీస్పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక మూడో టీ20లో భారత్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో తమ సత్తా ఏంటో చూపించింది.
ఓపెనర్ బ్యాటర్, వికెట్కీపర్ సంజూ శాంసన్ ఫామ్
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు సంజూపై క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఓపెనింగ్లో అవకాశం లభించడంతో, అతడు జట్టుకు బలమైన ఆరంభం ఇస్తాడని భావించారు. కానీ తొలి టీ20 మ్యాచ్లో సంజూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇన్నింగ్స్ను నిలబెట్టాల్సిన సమయంలో తొందరపాటు షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.
అయినప్పటికీ, అది సిరీస్లో తొలి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్దగా పట్టించుకోకుండా, “మొదటి మ్యాచ్ కదా” అంటూ విషయాన్ని తేలికగా తీసుకున్నారు.
ఫస్ట్ మ్యాచ్లో 10, రెండో మ్యాచ్లో 6, మూడో మ్యాచ్లో గుండు సున్నా పరుగులు మాత్రమే చేశాడు. అంటే మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 16 పరుగులు సాధించగలగాడు. ఇలా తక్కువ స్కోరు చేయడం వల్ల, మిగిలిన మ్యాచ్ల్లో అతను ఆడగలడా లేద అనే సందేహాలు వస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ ముందు ఇంత చెత్త పెర్ఫామెన్స్ ఇవ్వడంతో, ప్లెయింగ్ ఎలెవెన్లో చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు కూడా మొదలైనాయి.

