విశాఖపట్నం వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 215 పరుగులు సాధించి భారత్కు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీశారు. అయితే మధ్య ఓవర్లు, డెత్ ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ వేగంగా పరుగులు రాబట్టారు.
భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఓపెనర్లు డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్ భారత బౌలర్లపై దాడి చేస్తూ స్కోరుబోర్డును వేగంగా పరుగులు పెట్టించారు. పవర్ప్లే నుంచే దూకుడుగా ఆడిన వీరు, టీమిండియా బౌలింగ్ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు.
ఈ జోరులో కివీస్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను దాటింది. దీంతో న్యూజిలాండ్ స్కోర్ 250 పరుగులు దాటుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే కీలక సమయంలో డెవాన్ కాన్వే ఔటవ్వడం మ్యాచ్కు మలుపు తిప్పింది.
కాన్వే వికెట్ తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్లో వేగం తగ్గింది. వరుసగా వికెట్లు పడటంతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇన్నింగ్స్ కాస్త కట్టడిలో పడింది. భారత బౌలర్లు క్రమంగా పుంజుకుని మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తూ రన్స్ రేటును తగ్గించగలిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 215 పరుగులకే పరిమితమైంది.
హర్షిత్ రానా – రవి బిష్ణోయ్ బౌలింగ్ పర్ఫామెన్స్
మూడు మ్యాచ్లలో మంచిగా రాణించిన హర్షిత్ రానా ఈ మ్యాచ్లో మాత్రం ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. జరిగిన మూడు మ్యాచ్లలో పవర్ప్లేలో హర్షిత్ రానా మంచి బౌలింగ్ చేశాడు. అంతేకాదు, ఆ మ్యాచ్లలో డెవాన్ కాన్వేను తక్కువ పరుగులకే ఔట్ చేశాడు.
కానీ ఈ మ్యాచ్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కాన్వే వికెట్ తీయలేకపోయిన హర్షిత్ రానా, నాలుగు ఓవర్లు వేసి మొత్తం 53 పరుగులు ఇచ్చాడు.
నిజానికి 3వ టీ20లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అదికూడా గ్లెన్ ఫిలిప్స్, చాంప్మన్ లాంటి ఫామ్లో ఉన్న బ్యాటర్లను ఔట్ చేయడం విశేషం.
అయితే 4వ టీ20 మ్యాచ్లో బాగా బౌలింగ్ చేస్తాడని అంచనాలు ఉన్న బిష్ణోయ్, ఈ మ్యాచ్లో మాత్రం 49 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం కివీస్ స్కోర్ 215 కాగా, హర్షిత్ రానా – రవి బిష్ణోయ్ ఇద్దరూ కలిసి ఇచ్చిన పరుగులు 93 కావడం గమనార్హం.
దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలే అవకాశాలు తక్కువగా వస్తున్న సమయంలో ఒక మ్యాచ్లో బాగా ఆడి, వెంటనే వచ్చే మ్యాచ్లో నిరాశపరిస్తే ఎలా అంటూ విమర్శలు చేస్తున్నారు.

