చైనా సూపర్సోనిక్ రైలు టెక్నాలజీ: రైలు ప్రయాణమా… లేక రాకెట్ ప్రయాణమా?
రైలు ప్రయాణమా… లేక రాకెట్ ప్రయాణమా? అన్న సందేహం కలిగించేలా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేయడానికి చైనా సిద్ధమైంది. రవాణా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తూ, శబ్ద వేగాన్ని మించే సూపర్సోనిక్ రైలును చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
గంటకు సుమారు 1200 కిలోమీటర్ల అద్భుతమైన వేగంతో దూసుకెళ్లే ఈ హైటెక్ రైలు, ఇప్పటివరకు మనం చూసిన బుల్లెట్ ట్రెయిన్లకే కాదు… విమానాలకు కూడా గట్టి పోటీగా నిలవనుంది.
30 నిమిషాల్లో 700 కిలోమీటర్ల ప్రయాణం!
ఈ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గంటల తరబడి పట్టే ప్రయాణం, ఇకపై అరగంటలోనే పూర్తి కానుంది.
మాగ్లెవ్ నుంచి సూపర్సోనిక్ రైలు వరకు
ఇప్పటికే గంటకు 501 కి.మీ. వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైళ్లతో రికార్డులు సృష్టిస్తున్న చైనా, ఇప్పుడు ఏకంగా శబ్ద వేగాన్ని ఛేదించే సూపర్సోనిక్ రైలును సిద్ధం చేస్తోంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాకు చెందిన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు ఈ అత్యాధునిక ప్రాజెక్ట్పై వేగంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
Electromagnetic Sled టెక్నాలజీ అంటే ఏమిటి?
భవిష్యత్ రవాణా వ్యవస్థలకు దిశానిర్దేశం చేసేలా రూపొందిస్తున్న ఈ టెక్నాలజీకి వారు “విద్యుదయస్కాంత స్లెడ్జ్ (Electromagnetic Sled)” అనే పేరు పెట్టారు.
ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే… సంప్రదాయ రైళ్లలా ఇంజిన్లు, చక్రాలపై ఆధారపడకుండా, పూర్తిగా విద్యుదయస్కాంత శక్తి (Electromagnetic Power) సహాయంతో పనిచేస్తుంది.
శక్తివంతమైన మాగ్నెట్లు సృష్టించే బలమైన క్షేత్రం వల్ల వాహనం పట్టాలపై తాకకుండా గాలిలో తేలుతూ అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తుంది.
రవాణా రంగంలో కొత్త యుగానికి నాంది?
ఈ సూపర్సోనిక్ రైలు టెక్నాలజీ విజయవంతమైతే, భవిష్యత్తులో రైలు ప్రయాణాల నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. దూరాలు చిన్నవవుతాయి… సమయం మరింత విలువైనదిగా మారుతుంది.
