దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పండుగ శుభవార్త అందింది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎరువుల సబ్సిడీ (Fertilizer Subsidy)గా రూ. 3,000 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఎరువులను తక్కువ ధరలకు, సులభంగా అందుకునే అవకాశం లభించనుంది. అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రైతులకు ఏర్పడే ఆర్థిక భారం తగ్గించడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ సబ్సిడీ ద్వారా DAP (Di-Ammonium Phosphate), MOP (Muriate of Potash), NPK (Nitrogen, Phosphorus, Potassium) వంటి ముఖ్య ఎరువుల ధరలను స్థిరంగా ఉంచుతారు. రైతులు నాణ్యమైన ఎరువులను సమయానికి పొందేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ చర్యతో దేశంలోని సుమారు 14.6 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. రైతులు సకాలంలో నాణ్యమైన ఎరువులను పొందడం వల్ల పంట దిగుబడులు పెరగడమే కాకుండా, దేశ ఆహార భద్రతకు, వ్యవసాయ వృద్ధికి కూడా బలమైన మద్దతు లభించనుంది.
