ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించారు. “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనితకు మహిళలు అడుగడుగునా హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు, ప్రజలు ఆమెను ఆత్మీయంగా కలుసుకున్నారు. అనంతరం అనిత ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు, స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఇటీవల మృతిచెందిన విద్యార్థి వరహాలు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరహాలు బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.
