హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై గురువారం తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పాత కేసులకు సంబంధించి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, అలాగే తక్షణ ఉపశమనం కోసం కోరిన మధ్యంతర బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, మధ్యంతర బెయిల్పై నిర్ణయాన్ని రేపటికి (శుక్రవారం) వాయిదా వేయగా, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక అంశాలను లేవనెత్తారు. కరీంనగర్లో బాధితురాలిపై తప్పుడు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. బాధితురాలి తల్లి పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో, కరీంనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారని వివరించారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో ఈ కేసులో సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ వాదించారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. “ఇక్కడ అందరు సమానమే. ప్రతిసారీ నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించింది. అయితే బండి సంజయ్ కుమారుడు కావడంతోనే నిరాధారంగా పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పొలిటికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. నిందితుడిని సామాన్యుడిలాగే పరిగణించి న్యాయం చేయాలి” అని ఆయన కోరారు. ఇక, తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోరడంతో, కోర్టు రేపు మధ్యంతర బెయిల్పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
