1947లో దేశ విభజన తర్వాత నదీ జలాల పంపిణీపై వివాదం తలెత్తింది. దీనిని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంక్ (World Bank) మధ్యవర్తిత్వం వహించింది. సుదీర్ఘ చర్చల అనంతరం సెప్టెంబర్ 19, 1960న కరాచీలో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు అలాగే ఇండస్, జీలమ్, చీనాబ్ నదులు పాకిస్థాన్ కు కేటాయించడం జరిగింది. ఇది రెండు దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, జీవనోపాధి, ఎనర్జీ ఉత్పత్తికి సింధూ నది ఎంతగానో ఉపయోగపడుతోంది.
దాదాపు ఆరు దశాబ్దాలుగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చెక్కుచెదరకుండా కొనసాగుతూ వస్తోంది సింధు నది జలాల ఒప్పందం (Indus Waters Treaty). కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలను, వ్యవసాయ రంగాన్ని సాకుతూ వస్తున్న ఈ జీవనది, ఇప్పుడు భౌగోళిక రాజకీయాల (Geopolitics) మధ్య చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 26 మంది జవాన్లు వీరమరణం పొందడం భారత ప్రభుత్వాన్ని తీవ్ర నిర్ణయాల వైపు పురికొల్పింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్, కేవలం ఆర్థిక ఆంక్షలకే పరిమితం కాకుండా, అత్యంత కీలకమైన నీటి ఒప్పందంపై దృష్టి సారించింది. దాంతో పాకిస్థాన్ కు నీళ్లు బంద్ అయ్యాయి.
పాకిస్థాన్ లోని వ్యవసాయ రంగానికి, తాగునీటికి సింధూ నది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అయితే ఈ నీటిని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు నీటి కష్టాలు తీవ్రతరం అయ్యాయి. వేసవి కావడంతో ఆ పరిస్థితి మరింత పెరిగింది. నీటి కొరత కారణంగా పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. అయితే సింధూ నది జలాల ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తిరిగి చర్చలు ప్రారంభం కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
