భారత్–న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 సిరీస్కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఒక కీలక ప్రకటన చేసింది. గాయ కారణంగా భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్కు దూరం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుందర్ పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి అవసరమని మెడికల్ టీమ్ సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుండగా, సిరీస్ మొదలయ్యే ఐదు రోజుల ముందే సెలెక్షన్ కమిటీ జట్టులో రెండు ముఖ్యమైన మార్పులను ప్రకటించడం గమనార్హం.
వాషింగ్టన్ సుందర్కు సైడ్ స్ట్రెయిన్ గాయం
వాషింగ్టన్ సుందర్కు పక్కటెముకల భాగంలో (సైడ్ స్ట్రెయిన్) గాయం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. జనవరి 11న వడోదరలోని బీసీఏ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ సమయంలో ఈ గాయం అతడికి తగిలినట్లు సమాచారం.
మ్యాచ్ మధ్యలో అసౌకర్యం ఎదుర్కొన్న సుందర్ వెంటనే భారత మెడికల్ టీమ్ పర్యవేక్షణలోకి వెళ్లాడు. స్కాన్లు, పరీక్షల అనంతరం గాయం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో అతడికి పూర్తిగా విశ్రాంతి అవసరమని నిర్ణయించి, కొనసాగుతున్న సిరీస్తో పాటు రాబోయే టీ20 సిరీస్కు కూడా అతడిని దూరంగా ఉంచాలని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంది.
వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్
సుందర్ స్థానంలో యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవి బిష్ణోయ్ ఇప్పటికే టీ20 ఫార్మాట్లో తన స్పిన్ బౌలింగ్తో మంచి ప్రభావం చూపాడు. న్యూజిలాండ్ లాంటి బలమైన బ్యాటింగ్ జట్టును ఎదుర్కోవాలంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల స్పిన్నర్లు కీలకంగా మారతారు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ ఎంపిక భారత జట్టుకు అదనపు బలం చేకూరుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్
ఇద సమయంలో మరో కీలక మార్పుగా, గాయపడిన యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను టీమ్లోకి తీసుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో అనుభవాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారిక అడ్వైజరీలో పేర్కొంది. శ్రేయస్ అయ్యర్ మధ్యక్రమంలో స్థిరమైన బ్యాట్స్మన్గా పేరు సంపాదించాడు. ఒత్తిడిలోనూ ఇన్నింగ్స్ను నిలబెట్టే సామర్థ్యం అతడికి ఉంది. న్యూజిలాండ్తో జరిగే కీలక టీ20 సిరీస్లో అతడి అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడే అవకాశముంది
బీసీసీఐ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. జట్టు అవసరాలు, ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది.
భారత్–న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ సిరీస్ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇలాంటి సమయంలో జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించడంతో పాటు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడం భారత జట్టును మరింత బలంగా మార్చనుందని భావిస్తున్నారు.
మొత్తానికి, రాబోయే టీ20 సిరీస్లో భారత జట్టు కొత్త కాంబినేషన్తో బరిలోకి దిగనుండగా, ఈ మార్పులు జట్టు ప్రదర్శనపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.

