ఏలూరు జిల్లా: ద్వారకాతిరుమల బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది
బుధవారం శ్రీవిద్య పుట్టినరోజు కావడంతో ఆమె తల్లి, పెద్దమ్మ, అక్క కేక్, కొత్త బట్టలు తీసుకుని పాఠశాలకు వెళ్లారు. అయితే ఉదయం నుంచి పాఠశాల ఆవరణలోనే వేచి ఉన్నప్పటికీ, విద్యార్థినిని కలవనివ్వలెదని.
మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో భోజన విరామం కావడంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, ప్రిన్సిపాల్ అడ్డుకుని తమను అనుమతించలేదని వారు ఆరోపించారు. దీంతో తమ కుమార్తెను ఒక్కసారి చూసేందుకు సాయంత్రం వరకు పాఠశాల గేటు వద్దే వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
సాయంత్రం సమయంలో ప్రిన్సిపాల్ విద్యార్థిని శ్రీవిద్యను పాఠశాల నుంచి బయటకు పంపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే అప్పటికే రాత్రి కావడంతో బస్సులు అందుబాటులో లేక చిన్నారి బస్టాండ్లో బిక్కుబిక్కుమంటూ ఏడవాల్సి వచ్చిందని, ఈ దృశ్యం స్థానికులను కలచివేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తమ కుమార్తెను స్వచ్ఛందంగా ఇంటికి తీసుకెళ్తున్నట్లు పేర్కొంటూ తమతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని శ్రీవిద్య తల్లి విలేకరులకు ఆరోపించారు. "పుట్టినరోజు రోజున మా బిడ్డను మేము కలవకూడదా? ఉదయం నుంచి భోజనం కూడా చేయలేదు" అంటూ ఆమె కన్నీటి పెట్టుకున్నారు.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ స్పందన కోసం ప్రయత్నించగా ఆమె ఫోన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. పాఠశాల యాజమాన్యం లేదా సంబంధిత గురుకుల విద్యాసంస్థల అధికారుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
