నీట్-యూజీ 2026 పరీక్షలో పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేపర్ లీక్ గురించి స్పందించాడు. కష్టానికి తగిన ఫలితం, నిజాయతీకి తగిన గౌరవం, ప్రతిభకు తగిన గుర్తింపు అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా తన తండ్రి, ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ నేర్పిన విలువైన పాఠాన్ని సచిన్ గుర్తుచేసుకున్నాడు. "పరాజయం పర్వాలేదు కానీ, మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని పేర్కొన్నాడు. కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అభిప్రాయపడ్డాడు.
యువత తమ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎలాంటి అడ్డదారులను ఎంచుకోకుండా, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీతో ముందుకు సాగాలని సచిన్ సూచించారు. కష్టపడి సాధించిన విజయమే జీవితాంతం గర్వంగా నిలిచిపోతుందని, విలువలతో కూడిన విజయమే నిజమైన విజయమని ఆయన పేర్కొన్నారు.
తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి" అని సచిన్ టెండూల్కర్ సూచించారు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Ravindra G
✓ Verifiedమేము ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా వార్తలు, అన్ని ప్రభుత్వ ఉద్యోగలకు సంబంధించిన పుస్తకాలు న్యూస్ తాజా అప్డేట్లను ఆధారంగా పరిశీలించి, నమ్మదగిన, ఖచ్చితమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం మా లక్ష్యం. News
