ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ‘ఇడుపు కాయితం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తుండగా, ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. ఇందులో నాగదుర్గ ‘శ్రీలత’ అనే తెలంగాణ యువతి పాత్రలో కనిపించనుంది.
![]() |
| Naga Durga |
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న నాగదుర్గ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు బిగ్ బాస్ తెలుగు నుంచి ఆఫర్ వచ్చిన మాట నిజమేనని వెల్లడించింది. అయితే తాను ఆ షోకు సరిపోనని భావించి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపింది.
“నేను చాలా సైలెంట్గా ఉంటాను. మొహమాటం ఎక్కువ. ఎవరికైనా ‘నో’ చెప్పాలన్నా చాలా ఇబ్బంది పడతాను. నా భావాల కంటే ఎదుటివారి భావాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అదే కొన్ని సందర్భాల్లో నాకు సమస్యగా మారవచ్చు. అందుకే బిగ్ బాస్ వంటి పెద్ద షోను అంగీకరించలేదు” అని నాగదుర్గ చెప్పింది.
బిగ్బాస్ ఆఫర్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహాల గురించి కూడా నాగదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. “అమ్మ నాతో... నువ్వు చిన్న విషయానికే ఇంత ఎమోషనల్ అవుతావు. బిగ్బాస్ హౌస్లో జరిగే పరిస్థితులను ఎలా తట్టుకుంటావో ఆలోచించు అని చెప్పింది. కానీ నాన్న మాత్రం కనీసం రెండు మూడు వారాలైనా హౌస్లో ఉంటే టెలివిజన్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతావని సూచించారు” అని వెల్లడించింది.
అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని నాగదుర్గ స్పష్టం చేసింది. హీరోయిన్గా మంచి అవకాశాలు అందుకుని సినీ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని తన లక్ష్యమని పేర్కొంది. ‘ఇడుపు కాయితం’ సినిమా తన కెరీర్లో కీలక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

