ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణించిన నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం, కుటుంబ నేపథ్యం గురించి ఆయన పంచుకున్న విషయాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తనను ఎవరైనా పరిచయం అడిగితే ముందుగా "నేను మనిషిని" అని చెప్పుకుంటానన్నారు.
"నటన నా వృత్తి. దానిని దైవంగా భావిస్తాను. సమాజంలో జరిగే విషయాలపై స్పందించే స్వభావం నాకు ఉంది" అని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణించిన నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.
తన తల్లి స్వర్ణలత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ప్రకాష్ రాజ్ వివరించారు. "1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకు వలస వచ్చారు. మా అమ్మకు 12 ఏళ్ల వయసులోనే తల్లి మరణించారు. ఆ తర్వాత తండ్రి కూడా దూరమయ్యారు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు" అని చెప్పారు.
"అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మను ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేసింది. వాళ్లకు తమ జాతి, కులం, బంధువులు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది" అని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
గతంలో తాను నాస్తికుడినని బహిరంగంగా ప్రకటించిన ప్రకాష్ రాజ్, ఇటీవల తన తల్లి అంత్యక్రియలను మతపరమైన సంప్రదాయంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు కూడా స్పందించారు.
"అవును… నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మకు తన దేవుడిపై విశ్వాసం ఉంది. ఆమె నమ్మకాన్ని గౌరవించడం నా బాధ్యత. ఆమె విశ్వాసం ప్రకారం అంత్యక్రియలు జరిపించడం నా బాధ్యత" అని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన తల్లి జీవిత పోరాటం, ఆమె నమ్మకాల పట్ల చూపిన గౌరవం, అలాగే మానవత్వానికి ఇచ్చిన ప్రాధాన్యం గురించి నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు.
